Saturday 12 September 2015

అరుంధతీ నక్షత్రం

అరుంధతీ (నక్షత్రం) ఎందుకు
పూజ నీయమైంది?
ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని
చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది
మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం
కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త
పురాణ వ్యాఖ్యానదక్షుడు
అయినటువంటి సూతుని
ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి
ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.
“అరుంధత్యనసూయా చ సావిత్రీ
జానకీసతీ తేజస్వనీ చ పాంచాలీ వందనీయ
నిరంతరం!!’
అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత,
ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ
మూర్తులు సదా వందనీయులని
తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో
అగ్రగామి. ఈమె చరిత్రను
స్మరించినంతనే పుణ్యం
కలుగుతుందని ‘నైమిసమ్హితా
పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి
జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు
చెప్పబోతున్నాను అన్నాడు సూత
మహాముని.
ఒకనాటి ప్రశాంత సమయంలో
బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో
అత్యంత తేజోవితయైన ఒక కన్యను,
వర్ణింపనలవికాని ఓక సుందరుని
సౄష్టించాడు. ఆ కన్య పేరు
‘సంధ్యా. యువకుని పేరు
మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు
సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ
యువకునికి -
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!!
అంటూ
అరవిందము, అశోకము, చూతము,
నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు
సమ్మోహన బాణాలను అందించాడు.
బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు
వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా,
బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న
‘సంధ్యా ను చూసి మోహానికి
లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి
ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ
ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు.
రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు
తలవంచిన సౄష్టికర్త కోపించి
మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి
భస్మమవుతావని శాపం ఇచ్చాడు.
తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం
కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా
చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట
తనువు చాలించదలచి పయనమై పోయింది.
అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని
పిలిచి సంధ్యకు తపోదీక్షను
అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు
ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును
వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు.
సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని
అనుగ్రహాన్ని పొందింది. శివుడు
ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ
లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం
వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని
అనుగ్రహించమంది. శివుడు ఆమె
లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని
కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా
భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను
కామదౄష్టిలో చూచినట్లయితే, వారు
నపుంసకులుగా మారాలి, అంతేకాదు
నేను పుట్టగానే అనేకమందికి కామవికారాని
కల్గించాను. కాబట్టి ఈ దేహం
నశించిపోవాలీ అని కోరింది. శివుడు
‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత
పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు.
ఆయన చేస్తున్న యాగకుండంలో
అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం
చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం
నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం
నశించే సమయంలో ఎవరినైతే భర్తగా
తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి
అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని
అగ్నికుండంలో దగ్ధం చేస్తూ
వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది.
అగ్నికుండం నుండి తిరిగి
జన్మించింది. సంస్కౄత భాషలో
‘అరుం’ అంటె అగ్ని, తేజము,
బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ
అంటె ధరించినది అనే అర్థం వున్నది.
అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి
ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర
వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త
అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి
వశిష్టునకు ఇచ్చి వివాహం
జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య
మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ
దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి
పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు
జన్మించారు. అరుంధతిని మనవారు
‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని
పిలుస్తూంటారు.
విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి
సంతతి గురించి, మనమలు,
మునిమనమలు గురించి
ప్రస్తావించబడివుంది.
అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే
దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన
దంపతులకు ఆకాశంలో సప్తర్థి
మండలంలో వున్న వశిష్టుని తారకు
ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ
నక్షత్రాన్ని కూడా చూపిస్తారు.
దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది.
వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ
దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన
దంపతులు సైతం వారివలెనే ఉండాలనే
ఉద్దేశ్యంతో మనవారు ఆ
దంపతులిద్దర్ని తారారూపంలో
వీక్షింపచేస్తూ రావడం ఒక
సాంప్రదాయమైంది. వీరిద్దర్ని
సందర్శించడం వలన దంపతులకు
ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము,
సౌభాగ్యములు కలుగుతాయి.

No comments:

Post a Comment