Friday 11 September 2015

వేద నిర్వచనం

సృష్టి ఆదిలో వేదాన్ని ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్న ఋషులు స్వరయుక్తంగా తొలిసారిగా దర్శించారు. భగవంతుడు వాళ్ళకి ఈ అపారమైన వేదరాశిని స్వరయుక్తంగా వినిపించాడు.వినబడినది కనుక వేదానికి 'శృతి' అనిపేరు.వేదాలను దర్శించిన ఋషులను మంత్రద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే చూసేవాడు. ఋషులు భగవత్ప్రసాదమైన,పరమేశ్వర వాణి అయిన వేదాలను చూశారు కనుక వారు మంత్రద్రష్టలే కానీ మంత్రకర్తలు కారు, వారు ఏ మంత్రాన్ని రాయలేదు. ఈశ్వరుడిచ్చిన మంత్రాలనే లోకానికి అందించారు. అందుకే ఋషులను ఆంగ్లంలో seers (one who see) అంటారు. మనకున్న ఋషులందరూ మంత్రద్రష్టలే. మరొక విషయం సృష్టి ఆది అన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న సృష్టిగా భావన చేయాలి. సముద్రపు అలలపై వచ్చే నురుగులో కొన్ని వందల నీటి బుడగలు పుట్టి, నశించిపోయిన రీతిలోనే భగవంతుని అనంతమైన సృష్టిలో ప్రతి క్షణం కొన్ని వందల విశ్వాలు ఉద్భవిస్తుంటాయి, ఆయనలో లీనమవుంటాయని సనాతన ధర్మం చెప్తుంది.వాటికి ఆద్యంతాలు ఎవరు చెప్పలేదు. దీనిని ఆధునిక సైన్సు కూడా అంగీకరిస్తుంది.మనకు ఈ యొక్క విశ్వమే కనిపిస్తున్నా, దానికి ఆవల కొన్నిలక్షల పాలపుంతలు, విశ్వాలు ఉన్నాయని, కొత్త విశ్వాలు ఉద్భవిస్తుంటాయని,కొన్ని నశించిపోతుంటాయని, ఇది ప్రకృతి యొక్క లక్షణమని అంగీకరిస్తుంది. దీనినే వేల సంవత్సరాల క్రితమే ఋషులు చెప్పారు.భగవంతుడి యొక్క ఉఛ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం.అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది.గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని,నేర్చుకునేది కాదు. ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్దాలు మారిపోతాయి, వ్యతిరేక.ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు మాహా విపత్తులకు దారి తీస్తుంది.అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. ఆ సంప్రదాయం చేత వేదానికి అనుశ్రవం అని పేరు.

No comments:

Post a Comment